ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని తాము మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చెప్పిన విషయాన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నేడు రాష్ట్ర హైకోర్టును కోరారు. దీనిపై తీవ్రంగా మండిపడిన రాష్ట్ర హైకోర్టు, ఈ విషయంలో తమ వ్యాఖ్యల నుంచి వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసింది.
కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ స్పష్టం చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. హైకోర్టు ధర్మాసనం తన వాదన వినకుండానే వ్యాఖ్యానాలు చేసిందని ఆయన ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు వ్యాఖ్యానించడం కోర్టు పరిధిలోకి రాదని కూడా ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ల నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాల సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.