రెండవ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఫిజికల్ గా వచ్చే ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని, దరఖాస్తులను సంబంధిత తహసీల్దారులు బూత్ స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు కేటాయిస్తూ మూడు రోజులలో క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.
హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్ డి.
మధుసూదన్ నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభిలతో కలిసి నూతన జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ టర్న్ అవుట్ పెంపుకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి, జనాభా ఓటర్ల నిష్పత్తి తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ సమయంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, గత ఎన్నికల సమయంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల జాబితా సమర్పించాలని అన్నారు. ఓటర్ నమోదు దరఖాస్తులపై ప్రతిరోజు నివేదిక అందించాలని, ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేసేందుకు అవసరమైన మేర ఆపరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా జనాభా ఓటర్ల నిష్పత్తి, లింగ నిష్పత్తి, ఓటర్లలో యువ ఓటర్ల నమోదు పై దృష్టి సారించి, వారి నిష్పత్తి పై సమాచారం అందించాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర జనాభా, ఓటర్ నిష్పత్తి, లింగ నిష్పత్తి ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రించి అందించాలని అన్నారు.