సిబిఐటి కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన నాల్గువ సెమిస్టర్కు విద్యార్థులు అధ్యాపకులు హైదరాబాద్ కాజీపల్లిలో ఉన్న హెటెరో ల్యాబ్స్ను పారిశ్రామిక సందర్శనలో భాగంగా సందర్శించారు. కెమికల్ ఇంజినీరింగ్ హెచ్ఓడీ ప్రొఫెసర్ ఎం ముకుంద వాణి, ఐ బాల కృష్ణ, డాక్టర్ రాజ్ కుమార్ వర్మ, సంజీవ రెడ్డి ఈ పర్యటనను సమన్వయం చేశారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో కీలక ప్రక్రియ అయిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ ఉత్పత్తి దశలను తెలుసుకోవడం కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంతో ముఖ్యం. విద్యార్థులు వేర్హౌస్ విభాగంలో ముడి పదార్థాల నిల్వ, నమూనా మరియు పంపిణీ వంటి ప్రక్రియలకు గురించి తెలుసుకున్నారు. తరువాత ప్లాంట్లోని ఇతర విభాగాల సందర్శనలో ద్రావకాలు నిర్వహించడం, నిల్వ చేయడం, వివిధ లక్షణాలు, నిర్మాణ సామగ్రితో పెద్ద సంఖ్యలో రియాక్టర్లను కలిగి ఉన్న ప్రధాన ఉత్పత్తి ప్రాంతం ను సందర్శించారు అని వాణి తెలిపారు.
ఈ సందర్శన కేవలం పరిశీలనకే కాకుండా విద్యార్థులు పరిశ్రమ నిపుణులతో చర్చలు జరిపారు. వారు ప్రశ్నలు అడగడానికి, తయారీ ప్రక్రియ చిక్కులను లోతుగా పరిశోధించడానికి అవకాశం కలిగింది. సందర్శన సమయంలో, విద్యార్థులు సురక్షితమైన, సమర్థవంతమైన ఔషధాల ఉత్పత్తిని నిర్ధారించడానికి కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలను చూసే అవకాశం కలిగింది. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో, వారు కఠినమైన పరీక్షా విధానాలు, నియంత్రణ మార్గదర్శకాలను పాటించడం, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి నిబద్ధత గురించి తెలుసుకున్నారు. క్లాస్ రూమ్లలో పొందిన సైద్ధాంతిక పరిజ్ఞానం, హెటెరో ల్యాబ్స్లోని ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కలయిక అకాడెమియా, వాస్తవ ప్రపంచానికి మధ్య వారధిని సృష్టించింది అని వాణి తెలిపారు.