తిరుమల శ్రీవారి దర్శనానికి కొండకు నడిచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. క్రూరమృగాల సంచారంతో పాటు టీటీడీ తాజా నిబంధనలతో కాలినడక మార్గాలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా తిరుమల శ్రీవారిని నిత్యం 70వేల నుంచి 90వేల వరకు భక్తులు దర్శించుకుంటారు. వీరిలో 30 నుంచి 40శాతం మంది కాలినడకన కొండెక్కుతుంటారు.
అలిపిరి మార్గంలో 24 గంటల పాటు తిరుమలకు చేరుకోవచ్చు. శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. కొవిడ్ తర్వాత అంటే గత ఏప్రిల్ నుంచి అలిపిరి మార్గంలో వచ్చే భక్తులకు 10వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు 5వేల చొప్పున 15వేల దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా నడిచే భక్తులను కూడా కలిపితే 22వేల నుంచి 28 వేల వరకు కాలినడక భక్తులు వస్తున్నారు.
రద్దీరోజుల్లో ఈ సంఖ్య 30వేల నుంచి 32వేల వరకు చేరుతోంది.కొద్దిరోజులుగా అలిపిరి కాలినడక మార్గంలో క్రూరమృగాల సంచారం అధికమైంది. జూన్ 22న ఏడోమైలు వద్ద కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ అనే నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారి చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.
తాజాగా అలిపిరి మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల లక్షిత అనే బాలికపై చిరుత దాడిచేసి హతమార్చింది. దీంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్న క్రమంలో నడక మార్గంలో ప్రయాణంపై టీటీడీ ఆంఽక్షలు విధించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఉదయం 5నుంచి రాత్రి 10 గంటల వరకు, 15ఏళ్లలోపు పిల్లలతో వచ్చేవారిని మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది.
మరోవైపు శ్రీవారి మెట్టు మార్గంలోనూ ఉదయం 6నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే 15ఏళ్లలోపు పిల్లలున్న వారిని అనుమతిస్తామని స్పష్టంచేసింది. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉన్న గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు వందమంది చొప్పున భక్తులను భద్రతా సిబ్బంది సహాయంతో గుంపుగా పంపాలని నిర్ణయించింది. అలిపిరి నడకమార్గంలో వచ్చే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తారు. వీటిని నడకమార్గం మధ్యలోని గాలిగోపురం వద్ద స్కాన్ చేసుకోవాలి.
టోకెన్ స్కాన్ అయితేనే తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లో దివ్యదర్శన క్యూలైన్లోకి అనుమతిస్తారు. అయితే చిరుత దాడి నేపథ్యంలో దివ్యదర్శన టోకెన్లు పొందిన భక్తులు రోడ్డుమార్గాన తిరుమలకు చేరుకున్నప్పటికీ అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ క్రమంలో చాలామంది భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు తీసుకుని బస్సుల్లో, ట్యాక్సీల్లో తిరుమలకు వస్తున్నారు. నడవకపోయినా వీరికి 2గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది.
మధ్యాహ్నం తర్వాత పిల్లలకు అనుమతి లేకపోవడంతో చిన్నారులతో వచ్చేవారిలో చాలామంది రోడ్డుమార్గం ద్వారానే తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు మధ్యాహ్నం తర్వాత బోసిపోతున్నాయి. గతంలో 30వేల నుంచి 32వేల వరకు నడిచి వచ్చే భక్తుల సంఖ్య పులి దాడి, ఆంక్షల నేపథ్యంలో భారీగా తగ్గింది. తక్కువ మంది భక్తులు మాత్రమే కాలినడకన తిరుమలకు వస్తున్నారు. మరోవైపు కాలినడక భక్తులతో ఆర్టీసీ బస్సులు, టాక్సీలు కిటకిటలాడుతున్నాయి.