ఆరోగ్యతెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లోని రెడ్కో ప్రధాన కార్యాలయంలో కంటివెలుగు శిబిరాన్ని చైర్మన్ వై.సతీష్ రెడ్డి, వైస్ చైర్మన్&ఎండీ జానయ్య, జీఎం ప్రసాద్ ప్రారంభించారు.
కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారికి వైద్య సిబ్బంది కళ్లజోడు అందజేశారు. రెడ్కో కేంద్ర కార్యాలయంలో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న రెడ్కో సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు మెడికల్ ఆఫీసర్ శ్వేతారాణి, ఆప్తమాలజిస్ట్ కవితా రాణి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి అద్దాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. 15 రోజుల్లో అద్దాలు అందజేస్తామని చెప్పారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నవారికి మందులతో పాటు, ఐ డ్రాప్స్ అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యతెలంగాణగా మార్చేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిందని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నాలుగుకోట్ల మంది ప్రజలకు రెండో విడత కంటి వెలుగు ద్వారా కళ్ల పరీక్షలు చేస్తోందన్నారు. ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల అద్దాలు కూడా అందజేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.