ఆకాశాన్నంటిన ఉల్లి ధరలపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాయకాపురం మోడల్ రైతు బజార్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినియోగదారులతో కలిసి ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చున్నారు.
సంచి చేత పట్టుకుని క్యూలోనే తన వంతు వచ్చేవరకు నిల్చుని ఉల్లిపాయలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిలో ఉల్లిపాయల కోసం గంట నుంచి రెండు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. మహిళలు, వృద్దులు ఇలా గంటలతరబడి క్యూలో నిల్చోడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వినియోగదారులతో కలిసి తాను క్యూలో నిలుచుని వారి ఇబ్బంది ఏ స్థాయిలో వుందో స్వయంగా అనుభవించానని అన్నారు. నిత్యావసరాల కోసం ఇలా గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నీరుగార్చిందని మండిపడ్డారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ ప్రజలకు ఉల్లిపాయల పాట్లు తప్పడం లేదని అన్నారు.