దిశ చట్టంలో లోపం ఉంది సరిచేయమని కోరుతుంటే అధికారపక్షం ఎదురుదాడి చేస్తున్నదని నేడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘాటుగా స్పందించారు.
దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని అలాంటిది చట్టంలో లోపాల వల్ల ఏదో జరుగుతోందని అనటం ఏంటని ఆయన ప్రశ్నించారు. సభా వ్యవహారాలు తెలియని వాళ్లు, మొదటిసారి సభకు వచ్చిన వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంటుందని, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్పటం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు.
ఇంకా దిశ చట్టమే అమల్లోకే రాలేదు. ఇవాళ చట్టం తయారు చేశాక మరుసటి రోజు పొద్దున్నే అమల్లోకి వస్తుందా అని బుగ్గన నిలదీశారు. ఈ అంశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తుందని అన్నారు.
జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ అన్నారు. దిశ చట్టం నిన్నగాక మొన్న వచ్చింది. ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయి. అవి ప్రజలకు రీచ్ కావాలన్నారు. ప్రతిపక్షాల సూచిస్తున్న సూచనలను హోంమంత్రి నోట్ చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ సూచించారు.