సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో మరణించారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకుపైగా సాగింది. సినీ కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు.
1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తెరకెక్కించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంతంగా పద్మాలయా స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను, జానర్లను పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాల్లో నటించారు. మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు.