నువ్వు బతికి ఉన్నావా? ఆధారం ఏమిటి? కరిమూన్ అనే మహిళకు అధికారులు ఇదే ప్రశ్న వేస్తున్నారు. పాపం ఆమె ‘‘నేను బతికి ఉన్నాను’’ అని నిరూపించుకోవడానికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లోని షేక్ కరిమూన్ అనే మహిళ తన కుమార్తె కు అమ్మఒడి పథకం కోసం, తన కుటుంబానికి కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసింది. రికార్డుల్లో ఆమె పేరు లేకపోవడం, చనిపోయిన వారి జాబితాలో ఉండటంతో ఒక్క సారిగా ఆమెకు చుక్కలు కనిపించాయి.
ఇదే విషయంపై ఆమె ఇప్పుడు పోరాడుతున్నారు. బాధిత మహిళ కరిమూన్ తను బ్రతికే ఉన్నప్పటికీ చనిపోయిన విధంగా పోతవరం వాలంటీర్, వి.ఆర్.ఓ నమోదు చేసి మానసిక క్షోభ కు గురిచేసి అవమానించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
తహసీల్దార్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, కాల్ సెంటర్లలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యధోరణిని తెలియజేస్తుందని తెలిపారు. కరిమూన్ కు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని,అవసరం అయితే కోర్టుకు వెళ్లి అయినా ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హెచ్. ఆర్.సి.పి వ్యవస్థాపకులు షేక్ అబ్దుల్ మునాఫ్ తెలిపారు.
ముస్లిం మహిళ పట్ల వివక్ష చూపించడం అన్యాయం అని,చిలకలూరిపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయని, సమాచారహక్కు చట్టం కింద వివరాలు తెప్పించి పోరాడుతానని మునాఫ్ తెలిపారు.
శుక్రవారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం,హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపకులు షేక్ అబ్దుల్ మునాఫ్ బాధిత మహిళ కరిమూన్,ఆమె భర్త నిజాముద్దీన్ పాల్గొని మాట్లాడారు.