యాసంగిలో ప్రధాన నూనెగింజల పంటగా వేరుశెనగ వేయాలని సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దీనిని దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో విస్తరించాలని మంత్రి సూచించారు. ఆ దిశగా పాలెం, జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో తరచుగా రైతు అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆయన అన్నారు.
పంట క్యాలెండర్ తయారుచేసి దానికి అనుగుణంగా రైతువేదికలలో శిక్షణలు ఇవ్వాలని, ఆయిల్ పామ్ తో పాటు వేరుశెనగ మరియు ఇతర నూనెగింజల పంటల అభివృద్ధికి ఆయిల్ ఫెడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నిధులు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. వేరుశెనగ పంటకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని, వనపర్తి జిల్లా వీరాయపల్లిలో వేరుశెనగ పరిశోధనా కేంద్రానికి 40 ఎకరాలు కేటాయింపు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండే వేరుశెనగకు అంతర్జాతీయ డిమాండ్ ఉందన్నారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ సుధీర్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, ఇక్రిషాట్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జనీలా, ఇతర శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.