నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రజలు విల విల్లాడుతున్నారు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పెరిగిన కాయగూరల ధరలు, ఇంట్లో నిత్యం వాడే వస్తువుల ధరలు భగ్గు మంటున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం కొనేటట్లు లేదు, తినేటట్లు లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
అధిక ధరలు, ప్రభుత్వం వేసిన సకల పన్నులు ప్రజలకు పెనుభారంగా పరిణమించి వారి జీవితాల్లో గాడాంధకారం అలుముకొన్నది అని అభిప్రాయపడ్డారు. భాధ్యత లేని జగన్ రెడ్డి ఏలుబడిలో పెరుగుతున్నధరల ధాటికి, పన్నుల బాదుడుకు ప్రజల జీవితాలు ఆగమయ్యాయని అని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డికి జనం భాధలు పట్టడం లేదంటూ ఆగ్రహం చేశారు. ధరల మంటల్లో బడుగుల బతుకులు కాలిపోతున్నాయన్న ఆమె.. పది రోజుల వ్యవధిలోనే కాయకూరల రెట్టింపయ్యాయి. ఈ విధమైన ధరలు ఎప్పుడన్నా విన్నామా ? మొన్నటివరకూ రూ.100కు నాలుగైదు రోజులకు సరిపడా కాయగూరలు వచ్చేవని , కానీ ఇప్పుడు వందకు ఒక రకం కూడా కొనుగోలు చేసే పరిస్తితి లేదు అని ప్రజలు అంటున్నారన్నారు.
అన్ని కాయకూరల ధరలు,ఆకు కూరల భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్ లో బియ్యం, కందిపప్పు, పాలు వంటి అనేక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్య, మధ్య తరగతి వంటింటి బడ్జెట్లను తల్లకిందులు చేశాయి.10 రోజుల క్రితం వరకూ కిలో రూ.20 నుండి రూ.30 ఉన్న కాయకూరల ధరలు మూడు, నాలుగు రెట్లకుపైగా పెరిగాయి. 20 రోజుల క్రితం వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ధర భారీగా పెరిగింది అని అన్నారు.
రాష్ట్రంలో ఉల్లిపాయల ధర ఒక్కటే చౌకగా ఉందే తప్ప మిగిలిన రేట్లన్నీ ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. ఈ కూరగాయల ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ వర్గాలు చెబుతుండడం సామాన్యులను కలవరానికి గురిచేస్తోంది అని గౌతు శిరీష అన్నారు.