తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తు గడువు ముగిసింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన తొలి రోజు నుంచి ఇప్పటివరకూ లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజున దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించారు. ప్రతి దుకాణానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి.
ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్, సరూర్నగర్లో 8 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకుపైగా దరఖాస్తులు చేశారు. అత్యల్పంగా నిర్మల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21న డ్రా తీస్తారు. అనంతరం షాపులను అలాట్ చేస్తారు. ఈ టెండర్ల ప్రక్రియతో ప్రభుత్వానికి దాదాపు 3 వేల కోట్ల ఆదాయం లభించింది.