తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించి దాదాపు మూడేండ్లు కావొస్తోంది. ఈ మూడేండ్ల కాలంలో ఆయన జయంతి, వర్ధంతిని అధికార పార్టీ పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఆకస్మాత్తుగా అధికార పార్టీకి నాయిని గుర్తొచ్చారని విమర్శలు వస్తున్నాయి. నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రత్యేకమైన వ్యక్తి పేరును నామకరణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరూ ఊహించని విధంగా వీఎస్టీ –
ఇందిరా పార్కు స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరును నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (SRDP) లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. 2.63 కిలోమీటర్ల పొడవున్న
ఈ వంతెనను రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్ బ్రిడ్జికి దివంగత నాయకుడు నాయిని నర్సింహారెడ్డి పేరును నామకరణం చేస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.