బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ విడుదలైనప్పటి నుంచి వివాదం ముదిరింది. ఈ సినిమాలో దీపికా బికినీ కలర్పై రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై బీహార్లోని ముజఫర్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. ‘పఠాన్’ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు పఠాన్ విడుదలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
ముజఫర్పూర్కు చెందిన సుధీర్ ఓజా అనే న్యాయవాది స్థానిక కోర్టులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, ఆదిత్య చోప్రా, జాన్ ఇబ్రహీం, సిద్ధార్థ్ ఆనంద్లపై ఫిర్యాదు చేశారు. “పఠాన్ చిత్రంలోని బేషరమ్ రంగ్ అనే పాట అభ్యంతరకరంగా ఉంది, ఇది హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తుంది” అని ఓజా ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో అన్నారు. ఓజా ఫిర్యాదును కోర్టు జనవరి 3న విచారించనుంది.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇటీవలే ఈ పాటలో దీపికా పదుకొణె దుస్తుల రంగుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్తో సహా కొన్ని చోట్ల షారూఖ్ ఖాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.’పఠాన్’లోని ‘బేషరమ్ రంగ్’ పాట కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఆ తర్వాత అది వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాట విడుదలైన తర్వాత సినిమాపై వివాదం చెలరేగడంతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. జనవరి 25న ‘పఠాన్’ థియేటర్లలోకి రానుంది.