సాంఘిక దురాచారాలపై పోరాడి మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సామాజిక సంఘసంస్కర్త ఫాతిమా షేక్ అని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. సోమవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆధునిక భారత తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాతిమా షేక్ చిత్ర పటానికి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ సమాజంలో ఎదురయ్యే అసమానతలను రూపుమాపుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే,సావిత్రి బాయి ఫూలే దంపతులతో కలిసి మహిళ అభ్యున్నతికి, సామాజిక సేవకు నడుంగట్టిన మహనీయురాలు ఫాతిమా షేక్ అని తస్లీమా అన్నారు. ప్రాచీన కాలంలో విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉండేది, అలాంటి తరుణంలో తన కుటుంబానికి దూరంగా ఉండి అందరికీ విద్యను అందించడం కోసం అలుపెరుగని పోరాటం చేశారని తస్లీమా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ దారులు తదితరులు ఉన్నారు.