కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభుత్వాలను వణికిస్తున్న తరుణంలో దానిపై జరుగుతున్న సమరానికి చేయూతగా తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య పది లక్షల రూపాయల విరాళం అందించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నేడు సంబంధిత చెక్కును అందచేశారు. బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వానికి సాటి ప్రజలకు సాయపడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని శ్రీధర్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి పది లక్షల రూపాయల సాయాన్ని అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రి పువ్వాడ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ సాయి గీతిక స్కూల్స్ డిజీఎం చేతన మాథుర్ కూడా పాల్గొన్నారు.