యువత భగత సింగ్ ఆలోచనలు పుణికిపుచ్చుకునీ ఆయన ఆశయ సాధనకు ఉద్యమించాలని ఎఐవైఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు. విజయనగరం సిపిఐ జిల్లా కార్యాలయం డి.ఎన్.ఆర్ భవన్ లో ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 116 వ జయంతి ని నిర్వహించారు. ముందుగా ఎఐవైఎఫ్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశంకోసం పోరాటం చేసి తెల్లదొరలకి ఎదురొడ్డి పోరాడిన భయమెరుగని భారతీయుడు అని అన్నారు. బ్రిటిష్ వారితో పోరాటం చేయడంతో పాటు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రియమైన ఆలోచన విధానం కలిగించి చైతన్య పరిచారని అన్నారు. సామ్యవాదం, కమ్యూనిజం, శాస్త్రీయ సోషలిజం లక్ష్యాలతో అతి చిన్న వయస్సులో పోరాటం చేశారన్నారు.
దేశంలో ప్రజల రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్థితి గతులపై అధ్యయనం చేసి ఉద్యమించారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య పతనం కోసం ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో ఉరుకొయ్యలు ముద్దాడిన యువకిషోరం భగత్ సింగ్ అని అన్నారు. ఆయన పోరాట జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శం అని అన్నారు.
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాదని, చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగాలు దొరకని పరిస్థితి అని, ప్రభుత్వాలు ఆవిధమైన విధానాలు అవాలంభిoచడం వలన ప్రస్తుతం దుర్భర పరిస్థితి దేశంలో రాష్ట్రంలో నెలకొని ఉందన్నారు, ఇప్పటికైనా యువత మేల్కొని భగత్ సింగ్ ఆలోచన విధానం తో, పోరాటం స్ఫూర్తి తో ముందుకు వచ్చి ఉద్యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ మాజీ నాయకులు అప్పరుబోతు జగన్నాధం, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బాలి. గౌరినాయుడు, ఎఐవైఎఫ్ నాయకులు జల్లేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.