చాతుర్మాస్య దీక్ష కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేష్ వెళ్ళిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి 30వ తేదీ శనివారం విశాఖకు తిరిగి వస్తున్నారు. శుక్రవారంతో దీక్ష ముగియనుండటంతో రిషికేష్ నుండి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు చాతుర్మాస్య దీక్ష కోసం జూన్ 21వ తేదీన రిషికేష్ వెళ్ళారు.
జూలై 3వ తేదీ నుండి దీక్ష ప్రారంభించారు. దాదాపు మూడున్నర నెలల అనంతరం విశాఖ వస్తున్నారు. దీక్షా కాలంలో ఉపనిషత్తులపై శిష్యులకు పాఠాలను బోధించారు. ఆదిశంకరాచార్యుల వారి శంకరభాష్యంపై అధ్యయనం చేస్తూ వేదాంత చింతనతో కాలం గడిపారు.
ఈ ఏడాది మాండుక్యోపనిషత్తుపై విపులంగా పాఠాలను బోధించిన స్వరూపానందేంద్ర స్వామికి స్వాత్మానందేంద్ర స్వామితో పాటు శిష్యులు పాదపూజ చేసారు. హిమాలయ పాద ప్రాంతంలో సంచరిస్తూ రుషులు, సాధు పుంగవులతో ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. రిషికేష్, హరిద్వార్ పుణ్యధామాల్లో సాధువులు, వేద, సంస్కృత విద్యార్ధులకు భండారా(అన్న ప్రసాద వితరణ) నిర్వహించారు. గంగాతీరంలో హైందవ ధర్మ ప్రచారం సాగిస్తున్న అనేక ఆశ్రమాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు