దయ, కరుణ, ప్రేమ లేని, కరుడుగట్టిన మనస్థత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, అన్నెం పుణ్యం ఎరుగని జనపల్లి శ్రీనివాసరావును కోడికత్తి కేసులో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ పదే పదే చెప్పినా, విచారణకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత ఉన్నా ఏళ్ళ తరబడి కేసును సాగదీస్తూ, శ్రీనుని నాలుగున్నరేళ్ళుగా జైల్లో మగ్గేలా చేస్తున్నట్లు ఆరోపించారు. మైక్ పట్టుకొని నా ఎస్సీ, నా ఎస్టీ అని మాట్లాడే ముఖ్యమంత్రికి దళితుల పేరు చెప్పే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు.
దళిత , బహుజన కులాల ప్రతినిధులు సభల్లో సిఎం ను నిలదీయాలని పిలుపునిచ్చారు. తల్లి సావిత్రమ్మ కు ఎలాంటి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, ఆమె కన్నీళ్ళకు సీఎం కారణమయ్యారు ఆన్నారు. ఈ కేసులో చట్ట ప్రకారం మూడున్నరేళ్ళ శిక్షకాలం ఉంటే, అంతకు మించి శీను శిక్షను ను అనుభవించినట్లు చెప్పారు. ఎన్ఐఏ విచారణను విజయవాడ నుంచి విశాఖపట్నం మార్చి, వైకాపా రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
కోడి కత్తి ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైకాపా నాయకులు మజ్జీ శ్రీనివాస్ ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. కొడుకు దూరమైన తల్లి మనో వేదనతో ఏదైనా ప్రాణ హాని జరిగితే, అందుకు వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బాలకోటయ్య హెచ్చరించారు.