ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్న 16 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. వీటితో బాటు ఫేస్ బుక్ ఎకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. ఈ మొత్తం ఛానెళ్లు, ఫేస్ బుక్ ఎకౌంట్లకు కలిపి మొత్తం వీక్షకుల సంఖ్య 68 కోట్లుగా ఉంది. ఇంత మంది సబ్ స్క్రైబర్లను చేర్చుకుని తప్పుడు సమాచారాన్ని ఈ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిన వాటిలో ఆరు యూట్యూబ్ ఛానెళ్లు పాకిస్తాన్ నుంచి నడుపుతున్నారు. దేశంలో భయాందోళనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి తప్పుడు సమాచారాన్ని ఈ ఛానెళ్లు వ్యాప్తి చేస్తున్నాయని భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన లో వెల్లడించారు. “ఐటీ రూల్స్, 2021లోని రూల్ 18 ప్రకారం ఈ డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ఎవరూ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించలేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్, భారత్ కు విదేశీ సంబంధాల వంటి సున్నిత అంశాలపై కూడా ఈ ఛానెళ్లు తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నాయి. మత పరమైన అంశాలను పబ్లిక్ లోకి పంపిస్తూ మత సామరస్యాన్ని భంగపరిచేందుకు వీరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ గత వారం ప్రైవేట్ టెలివిజన్ న్యూస్ ఛానెల్లకు ఒక ఎడ్వయిజరీ జారీ చేసింది.
తప్పుడు వాదనలు చేయడం భారత ప్రతిష్టకు భంగం కలిగించే హెడ్లైన్లను ఉపయోగించడం నిషేధమని ఆ ఎడ్వయిజరీలో పేర్కొన్నారు. గతంలో బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్తతో బాటు తాజాగా బ్లాక్ చేయబడిన YouTube ఛానెల్లలో MRF TV LIVE, సైనీ ఎడ్యుకేషన్ రీసెర్చ్, తహఫుజ్-ఇ-దీన్ ఇండియా మరియు SBB న్యూస్ ఉన్నాయి.