విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన వేపాడ మండలం రామస్వామిపేట కి చెందిన 36 ఏళ్ల గుడే కోటేశ్వరరావు అనే ఆటో డ్రైవరు కు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కే. నాగమణి 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 3000/-లు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చినట్టు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళితే జిల్లాలోని వేపాడ మండలం రామస్వామిపేట కి చెందిన నిందితుడు గుడే కోటేశ్వరరావు (36) అనే వ్యక్తి ఒక మైనరు బాలికపై లైంగిక నేరంకు పాల్పడినట్లుగా బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్.కోట పోలీసు స్టేషనులో 2019 ఫిబ్రవరి నెల లో పోక్సో చట్టం ప్రకారం అప్పటి ఎల్.కోట ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేసారు. అయితే అప్పటి విజయనగరం సబ్ డివిజన్ డిఎస్పీ డి. సూర్య శ్రావణ్ కుమార్ దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.
అనంతరం, విజయనగరం డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పి. వీరాంజనేయ రెడ్డి నిందితుడిపై న్యాయస్ధానంలో అభియోగ పత్రం దాఖలు చేసారు. ఈ కేసును ప్రాధాన్యత కేసుల జాబితాలో చేర్చి, ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. నిందితుడు గుడే కోటేశ్వరరావు మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె. నాగమణి నిందితుడికి 20సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.2000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
అదే విధంగా నిందితుడు అట్రాసిటీ చట్టం సెక్షన్ 3(1)(డబ్ల్యూ)(1) ప్రకారం నేరంకు పాల్పడినందుకుగాను ఒక ఏడాది జైలు, 1000/- జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, విజయనగరం ప్రస్తుత డిఎస్పీ ఆర్. గోవిందరావు పర్యవేక్షణలో కోర్టు ఎఎస్ఐ వి.సత్యం, సి.ఎం.ఎస్. హెచ్.సి. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు.
నిందితుడు శిక్షలను ఏక కాలంలో అనుభవించాలని, తీర్పులో వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించారు.