రెవిన్యూ సంబంధ అంశాలపై పెండింగ్ లేకుండా తహశీల్దార్లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసిల్దార్లతో జీవో 58, 59 అమలు, బల్క్ ఇష్యూస్, ధరణి మాడ్యూల్ కి సంబంధించి దరఖాస్తుల పరిష్కారం, గురించి కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే నెంబర్ల ప్రకారం గూగుల్ ఎర్త్ లో టైం ఇమేజ్ డౌన్లోడ్ చేయాలని, ఆ ప్రకారం ఎప్పటి నుంచి పొజిషన్లో ఉన్నది చూడాలన్నారు.
రోజువారి తనిఖీల లక్ష్యాలు పెట్టుకొని త్వరగా పరిశీలన పూర్తి చేయాలన్నారు.జీవో 59 ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి, మొదటి విడతలో జారీచేసిన నోటీసులకు గాను డిమాండ్ మొత్తం వసూలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. రెండో విడత డిమాండ్ నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని, డిమాండ్ త్వరగా చెల్లించేలా అవగాహన చేయాలని అన్నారు.
ధరణి మాడ్యుళ్లకు సంబంధించి ఫార్మాట్లు ఇవ్వడం జరిగిందని, అట్టి ఫార్మాట్ లో ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ధరణి లో పెండింగ్ దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్, ఖమ్మం ఆర్డిఓ గణేష్, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లాలోని మండల తహశీల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.