ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బోథ్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. అదివాసీల జెండా ఆవిష్కరించి, డోలు వాయిద్యాలతో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించి కోమరం భీం విగ్రహనికి మాలలు వేసి నివాళులు ఆర్పించారు. తుండుదెబ్బ, అదివాసీ సేన నాయకులు మాట్లాడుతూ అంతరించి పోతున్న ఆదివాసీ తెగలను కాపాడుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ప్రపంచ దేశాలన్ని ఆదివాసీ, సంస్కృతి, సంప్రదాయలకు రక్షణ కల్పించాలని గతంలోనే ఐక్య రాజ్య సమితికి కోరినట్లు తెలియజేశారు. కాని ప్రస్తుతం పాలకులు ఆదివాసీల రక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. అదివాసీలపై జరుతున్న విధ్వంస కాండను ఆపాలని డిమాండ్ చేశారు.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల రక్షణకు 1/70, పీసా, అటవీ హక్కుల చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. ఫలితంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఆదివాసీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు స్పష్టం చేశారు. 60 శాతం ఆదివాసీలు ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు.