కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు అభిష్టి వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం అభిష్టి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఫేస్ షీల్డ్స్, కళ్లద్దాలు, వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీసులకు పిపిఇ కిట్స్ అందచేశారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ కరోనాతో యుద్ధం చేయాలని అంతే తప్ప కరోనా సోకిన వారిని వివక్షతో చూడడం తగదన్నారు. కరోనా సోకిన వారికి మానసిక ధైర్యం చెబుతూ వారు త్వరగా కోలుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని చెప్పారు.
రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా పోలీసులు నిరంతరం ప్రజా రక్షణతో పాటు కోవిడ్ కేసులు వ్యాప్తి మరింత పెరగకుండా రాత్రి, పగలు విధి నిర్వహణ చేస్తున్నారని చెప్పారు. కరోనాపై ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీస్ శాఖలకు స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సహకారం అధ్బుతమని ఆయన చెప్పారు.
అభిష్టి సంస్థ లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు నల్లగొండ జిల్లాలో నిత్యావసరాలు, భోజనాల పంపిణీ, సానిటైజర్లు పంపిణీ చేస్తున్నారని అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ బాషా, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహా, ట్రాఫిక్ ఎస్.ఐ. నర్సింహా రావు, అభిష్టి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు వినీల్, స్వర్ణ, జగన్, రాజ్ కుమార్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.