సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8వ,తేది ఆదివారం జరగబోయే అత్యద్భుత మైన స్వామి అమ్మవార్ల శోభాయాత్రలో పుర ప్రముఖులు,మహిళలు,భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి కోరారు.
బుధవారం ఆలయ కార్యాలయంలో శోభాయాత్ర సన్నాహక సమావేశ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుజ్జుల కొండారెడ్డి మాట్లాడుతూ వార్షికంగా ఆదివారం జరిగే శోభాయాత్రలో దేవాలయంలో ఉన్న ఎనిమిది వాహనాలతో పాటుగా ఈ సంవత్సరం క్రొత్తగా రైతు మహిళా మండలి వారిచే తయారు చేయించిన కల్పవృక్ష వాహనం కూడా శోభాయాత్రలో భాగం కావడం విశేషమని కొండారెడ్డి అన్నారు.ఆదివారం ఉదయం ఐదు గంటలకు 9 వాహనాలపై ఊరేగింపుగా మేళ తాళాలతో,గోవింద నామస్మరణతో,ఆలయ అర్చకుల వేద పారాయణంతో,స్వామి అమ్మవార్ల శోభాయాత్ర ప్రారంభం అవుతుందని వివరించారు.
హుజూర్ నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద జరగే శోభాయాత్ర కార్యక్రమంలో గంట సేపు వివిధ రకాల కార్యక్రమాలతో,కోలాట భజనలతో వైభవంగా సాగుతుందని,ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆద్యంతం పట్టణ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ శోభాయాత్ర సన్నాహక సమావేశంలో పట్టణ ప్రముఖులు, అర్చకులు,స్థానాచార్యులు,దేవాలయం అభివృద్ధి సమితి సభ్యులు,మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్