సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. రైతు ఆత్మహత్య ఘటనపై ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ జోన్ లో తనకున్న వ్యవసాయ భూమి పోతుందన్న మనస్థాపంతో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానన్నారు.
పయ్యావుల రాములుది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని, రాములు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలో మాస్టర్ ప్లాన్ ను ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్ వెంటనే రద్దు చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు గత కొంతకాలంగా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారన్నారు. కనీసం అధికార పార్టీ నాయకులు స్పందించలేదని, వారికి హామీ కూడా ఇవ్వలేదన్నారు.
ఈ నియంత ప్రభుత్వానికి ఎంత మంది రైతుల ప్రాణాలు పోతే కళ్ళు తెరుస్తుందని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు తాను ముందుండి పోరాటం చేస్తానన్నారు.