నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు వ్యక్తులు లేదా సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించేలా నిరాధారమైన, దురుద్దేశపూర్వకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు కూడా ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పించారు. ప్రజలకు సరైన సమాచారం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు సమాచార పౌరసంబంధాల శాఖ స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వును తక్షణం రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
previous post