బంగాళా ఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను పట్ల ముఖ్యంగా రాయలసీమ,దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి,ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాల కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాండస్ తుఫాను ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి,మహా బలిపురం,శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు.
ఈప్రభావంతో ఈనెల 10వ తేదీ వరకూ రాయలసీమ,దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కావున ఆయా జిల్లాల కలక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి,నెల్లూరు జిల్లాలో 2,తిరుపతి జిల్లాలో 1,చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించడం జరిగిందని సిఎస్ డా.జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు,తి రుపతి,చిత్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
వర్షాలు,భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యునికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని సిఎస్.డా. జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.