జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ పుల్లంపేట లోని పుత్తనవారిపల్లి జగనన్న కాలనీ హౌసింగ్ లేఅవుట్ ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, లే ఔట్ కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తిచేయాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పుత్తనవారి పల్లి లేఅవుట్ నందు మొత్తం 157 ఇళ్లు మంజూరయ్యాయని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లో భాగంగా ఇండ్ల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేసుకుని వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు.
అనంతరం పుత్తనవారిపల్లె లేఅవుట్ నందు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ లేఅవుట్ నందు లబ్ధిదారులు చక్కగా ఇల్లు నిర్మించుకుంటున్నారని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారికి సకాలంలో మెటీరియల్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
అప్రోచ్ రోడ్డు పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా ఇచ్చే పేమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆలస్యం చేయకూడదన్నారు. సిమెంటు, స్టీలు, ఇసుక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.
ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే ఎంతో మంది పేదల జీవితాలలో వెలుగులు నింపిన వారమవుతామని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జగనన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని కొందరు ప్రజలు భూమి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రికార్డులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోదండరామిరెడ్డి, తహసీల్దార్ నరసింహులు, హౌసింగ్ డిఈ కుప్పుస్వామి, హౌసింగ్, ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.