ఈక్వెడార్ గ్వయాస్ ప్రావిన్స్లోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 116 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. జైలులో రెండు గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారినట్లు తెలిపారు.
మెక్సికన్ డ్రగ్స్ ముఠాల వల్ల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని జైలు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఆరుగురిని శిరచ్ఛేదం చేశారని తెలుస్తోంది. అల్లర్ల నియంత్రణకు యత్నించిన పోలీసుల్లో ఇద్దరు, దాదాపు 50మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని సమాచారం. ఈక్వెడార్ జైళ్లల్లో తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ ఘటనలపై ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఖండించింది. జైలు హింసపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులను శిక్షించాలని ఈక్వెడార్ ప్రభుత్వాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది.