గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు ప్రధాన రహదారి అద్వాన్నంగా తయారైంది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ రహదారికి మోక్షం కలగలేదు.
ఫలితంగా 21,22 వార్డుల పరిధిలోని శ్రామిక నగర్, సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంత ప్రజలు,వాహన దారులు రాక పోకలు సాగించాలంటే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున రహదారిపై గుంతలు ఏర్పడటంతో ఇటుగా ప్రయాణించాలంటే ప్రమాద భరితంగా మారుతోంది.
భారీ వర్షాల కారణంగా రహదారి మరింత అద్వాన్నంగా మారటం వల్ల కొద్ది నెలల క్రితం రహదారి మరమ్మత్తుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణకు తీసిన మట్టిని తెచ్చి పోయించారు.దీని వల్ల సమస్య పరిష్కారం కాక పోగా మరింత తీవ్రమైందని స్థానికులు అంటున్నారు.
మోకాళ్ళ లోతు గుంతల మధ్య రాక పోకలు సాగించలేని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.సి సి రోడ్డు నిర్మాణం జరిపి పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
సి సి రోడ్డు నిర్మిస్తేనే సమస్య పరిష్కారం- ఆకురాతి నాగేంద్రం
భారతీయ జనతా పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం గుంతల మయమై ప్రమాద భరితంగా మారిన రహదారిని మంగళవారం ఉదయం పరిశీలించారు.వర్షాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బ తినటంతో గత నాలుగు నెలల క్రితం మట్టి పోశారని కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా సమస్య తయారైందని అన్నారు.
గతం కంటే పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి సమస్య తీవ్రమైందని అన్నారు.సి సి రోడ్డు నిర్మాణం జరిపితేనె సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని అన్నారు.
ఉమ్మడిశెట్టి ముని స్వామి మాట్లాడుతూ,దశాబ్దాలుగా రహదారి అభివృద్ధికి నోచుకోలేదని,దీని వల్ల శ్రామిక నగర్,సుందరయ్య నగర్,భగత్ సింగ్ నగర్ ప్రాంత వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.