బస్తీల్లోని పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఎర్పాటు చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పోరేషన్ 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీ,15వ డివిజన్ కొత్తగూడెం డివిజన్ లలో ఎర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పేదల అరోగ్య భద్రత దృశ్య పేదలకు అందుబాటులోనే తమకు సమీపంలోనే బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ దవాఖానలో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని, టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు అని మంత్రి పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని ఈ ఆస్పత్రులను వినియోగించుకోవాలని పేదలకు సూచించారు.
నగరంలో ఇప్పటికే అనేక డివిజన్లలో బస్తీ దవాఖానాలున్నాయని, ఇవాళ మరో రెండు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం అని తెలిపారు. పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మాలతీ, వైద్య అధికారులు సిబ్బంది ఉన్నారు.