నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని మనస్థాపం చెందిన కొండల్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ప్రభుత్వ దిష్టిబొమ్మను ములుగు బిజెవైయం జిల్లా నాయకులు దహనం చేసి తమ నిరసన తెలిపారు.
భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ నిన్న చనిపోయిన కొండల్ వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామానికి చెందిన వాడని తెలిపారు.
గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయాడని తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులకు లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైనదని, ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొన్న బోడ సునీల్ నాయక్, నిన్న కొండల్ ఉద్యోగాలు రాక మనస్థాపానికి గురై చనిపోతున్నారని అన్నారు. ఈ గడీల పాలన కోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రభుత్వం గద్దె దిగే వరకూ పోరాడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, కార్యాలయ కార్యదర్శి చెల్లూరి మహేందర్, జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షులు జినుకాల కృష్ణ కర్రావు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు అశోక్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర కిషోర్ నాయక్, శ్రవణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కనుకుల అవినాష్, దేవ సింగ్ సాయి, ఆకాష్ కనుకుల, మహేష్, దినేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.