తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకు బిజెపి పాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వచ్చే ఆదాయం అంతా ఎటు పోతుందని ప్రశ్నించారు. అభివృద్ధి చేయాల్సిన నేతలే వాటిని బినామీల పేరుతో కాజేస్తున్నారని ఆరోపించారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే వాటిని సవ్యంగా ఉపయోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వంపైనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా బిజెపి ముందుకు వెళ్తుందని రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.