విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన పెట్టుబడిదారుల పండుగ సమ్మిట్ లో 378 ఒఎంయులతో రూ. 13.41లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరి కోసం? అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు పెట్టుబడుల రాకపై నిద్రపోయి, రాష్ట్రంలో ఉన్న పలు పెట్టుబడుల కంపెనీలను వెళ్లగొట్టి, ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వల్ల ఉపయోగం ఏమిటని? నిగ్గదీశారు.
గత ప్రభుత్వ హయాంలో నాలుగు సార్లు దావోస్ వెళ్లి, నాలుగు సమ్మిట్ లు నిర్వహిస్తే సుమారు రూ. 5.50లక్షల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఎంఒయులు కుదిరినట్లు గత ప్రభుత్వం చెబుతుంటే, ఏ దావోసు వెళ్లకుండా, ఇంట్లో నుంచి బయటకు రాకుండా, రెండు రోజుల్లో రూ.13.41 లక్షల కోట్లు తెచ్చామని చెప్పడం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసమే అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇందులో రూ.8 లక్షల 50వేల కోట్లుతో సోలార్ వంటి విద్యుత్ ఉత్పత్తికి పెట్టుబడులు పెడుతున్నట్లు, తద్వారా 1.50 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పటం మరింత విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అవసరాలకు పదివేల మెగావాట్ల విద్యుత్ సరిపోతుందని విద్యుత్ నిపుణులు చెబుతుంటే, మిగిలిన లక్ష 40 వేల మెగావాట్ల విద్యుత్తును ఏమి చేస్తారని ప్రశ్నించారు.
ఈ ఎంఓయులకు 4 లక్షల 50 వేల ఎకరాల స్థలం అవసరం ఉన్నట్లు అంటున్నారని, ఏ నల్లమల అడవులను నరికేసి ఇస్తారని ఎద్దేవా చేశారు. రాజధానిని పాడుబెట్టి, పోలవం ఎండబెట్టి, ఏం చేస్తారు అన్నారు. రాజధానిలో 40 వేల మంది పనివారులను తరిమేశారని, ఇసుకను దోచి 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారని, 30 వేల మంది విశాఖ ఉక్కు కార్మికులను రోడ్ల పై నిలబెట్టారని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ ల 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆయా ప్రభుత్వాలు కుదుర్చుకున్న పెట్టుబడులపై, ఉపాధి పై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరోమారు పదవిని నిలబెట్టుకునేందుకు తమ మానస పుత్రిక ఐప్యాక్ డ్రామా గానే భావిస్తామని బాలకోటయ్య తేల్చి చెప్పారు.