కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద గల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. రోడ్డుపైకి వచ్చి లారీ కింద పడి చనిపోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
వివరాల్లోకి వెళితే సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ స్టేజి వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో బిఎ చదువుతున్న అనుశ్రేష్ఠ ఆత్మహత్య యత్నం చేసింది. కళాశాల నుంచి జాతీయ రహదారి పైకి వచ్చి లారీ కింద పడగా తీవ్ర గాయలపాలైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ఈ విషయమై ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. కళాశాలలో చదివే అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయంపై ప్రిన్సిపాల్ ను వివరణ కోరితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు విషయం చెప్పకుండా అమ్మాయికి ప్రేమ వ్యవహారం అంటూ బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నుంచి విద్యార్థులు బయటకు వెళ్తున్న కళాశాల సిబ్బంది పట్టించుకునే పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు. హాస్టల్ చుట్టూ కంచె లేకపోవడంతో కళాశాల వద్ద ఏం జరిగినా తెలియని పరిస్థితి ఉందని వాపోయారు.