బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వాహనంపై మా పార్టీ గూండాల దాడికి సిగ్గుపడుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె రఘురామకృష్ణంరాజు అన్నారు. దీనికి మా సీఎం జగన్ స్వయంగా స్పందిస్తే మంచిది. ఇక్కడ బీజేపీ నేతలపై దాడి చేసి, ఇక్కడ డిల్లీ కొచ్చి వాళ్ల పార్టీ నేతల కాళ్లుపట్టుకునే వ్యూహం సరైంది కాదు. వాళ్ల పార్టీ వారిని ఎలా కాపాడుకోవాలో బీజేపీ నాయకత్వానికి తెలుసునని ఆయన అన్నారు.
బీజేపీ నేతలపై జరిగిన దాడి గురించి సజ్జల మాట్లాడితే ఎలా? ఆయన చెబితే నమ్మేదెవరు? ఆయనేమైనా హోం మంత్రా? అసలు హోంమంత్రి ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి హోంశాఖ ఎవరి చేతుల్లో ఉందో పదోతరగతి పిల్లవాడికి సైతం తెలిసిపోతుంది. ఈ దాడి రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ఠ. కేంద్ర హోం శాఖ ఈ దిశగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. అయినా అమరావతికి ఎవరు మద్దతు ప్రకటిస్తే వారిని చంపేసే ప్రయత్నాలు చేస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
దేవుడు బీజేపీ నేతల వైపు ఉండబట్టి బతికి బయటపడ్డారు. వారికి ఏమైనా అయితే బాధ్యులెవరు? ఇది కచ్చితంగా వైసీపీ నేతల హత్యాప్రయత్నంగా భావించి నిందితులపై హత్యానేరం నమోదు చేయాలి. బీజేపీ నేతలపై దాడి చేసిన మా పార్టీ గూండాలను తక్షణం అరెస్టు చేయాలి. బీజేపీ నేతలపై మా పార్టీ గూండాలు చేసిన దాడికి పార్టీ ఎంపీగా బీజేపీ నాయకత్వానికి నేను క్షమాపణ చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.