మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడత పనులను అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విద్యా శాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలు ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 195 పాఠశాలల పనులు పూర్తి కాగా, 77 పాఠశాలలు పెయింటింగ్ తో సహా పనులు పూర్తి చేసుకున్నట్లు ఆయన అన్నారు. 95 పాఠశాలలకు డ్యూయల్ డెస్క్ ల సరఫరా జరిగినట్లు ఆయన తెలిపారు. పనులు పూర్తయిన వాటిలో ఇంకనూ 118 పాఠశాలలకు పెయింటింగ్ పనులు కావాల్సి ఉందని పెయింటింగ్ ఏజన్సీ తో మాట్లాడి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 231 చోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. 44 పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా జరిగినట్లు ఆయన తెలిపారు.
41 పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ, 89 పాఠశాలల్లో 50 శాతం కంటే తక్కువ ఇజిఎస్ పనులు జరిగినట్లు ఆయన అన్నారు. పనులు పూర్తయిన వెంటనే ఎఫ్టిఓ లు జనరేట్ చేయాలన్నారు. పనుల విషయంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఓనర్షిప్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పనులు ప్రతిరోజూ జరిగేలా పర్యవేక్షణ చేయాలని, ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పనుల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఇఇ లు, డిఇ లు, మండల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.