సరుకుల తూకాలలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దగా చేస్తున్న కుషాయిగూడ డి మార్ట్ స్టోర్ పై సోమవారం తూనికలు కొలతల శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఐదు కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 ఇతర సెక్షన్ల కింద 5 కేసులు నమోదు చేశారు.
ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే మొదటిసారికి రూపాయలు 10వేల నుంచి 25 వేల వరకు పెనాల్టీ పడే అవకాశం ఉందని లీగల్ మెట్రాలజీ విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం డీమార్ట్ లో హౌసింగ్ బోర్డ్ వాసి నారాయణ సరుకులను కొనుగోలు చేశారు.
సరుకుల తూకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి అంటూ బాధితుడు నెత్తి నోరు బాదుకున్నా డి మార్ట్ యాజమాన్యం స్పందించలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శివ సాయి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఏంపల్లి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మోసాలపై డి మార్ట్ సిబ్బందిని నిలదీస్తూ ధర్నాకు దిగారు.
డీమార్ట్ లో జరుగుతున్న అక్రమాలపై పోలీస్ కమిషనర్ రాచకొండ కమిషనరేట్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో మేడ్చల్ జిల్లా తూనికలు కొలతల శాఖ విభాగం ఉన్నతాధికారులు అసిస్టెంట్ కంట్రోలర్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు అనురాధ దేవి, అశోక్ రావు, రవీందర్ లు D- mart లో తనిఖీలు చేపట్టి వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు.