ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన రాధ గతంలో మతిస్థిమితం కోల్పోయారు. ఇటీవలే మానసిక పరిస్థితి కుదుటపడటంతో సోమవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిసబ్ రిజిస్ట్రార్ తస్లీమా కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు బ్రతికి నా పిల్లలను చూసుకుంటున్నాను అంటే అందుకు మీరు చేసిన సాయం వలనే అని తస్లీమా కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది.
వివరాలలోకి వెళితే గాజుల రాధ మతిస్థిమితం కోల్పోయి భర్త,పిల్లలను కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పలు పత్రికల లో ప్రచురితం అయిన కథనాలను చూసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అక్కడికి వెళ్ళి మతిస్థిమితం కోల్పోయిన మహిళ రాధ పరిస్థితిని చూసి ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. ఇటీవలే ఇంటికి వచ్చిన రాధ తన ఆరోగ్యం కుదుటపడటానికి సాయం చేసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ వద్దకు తన భర్తతో కలిసి సోమవారం వచ్చి కృతజ్ఞతలు తెలిపింది.