భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేసే వారికి నిరాశ కలిగించే వార్త ఇది. ఆ పార్టీకి ముస్లింలు కూడా ఓట్లు వేస్తున్నారు. ముస్లిం మహిళలు తమకు ఓటు వేశారని అందుకే తాము గెలుస్తున్నామని బిజెపి గత కొద్ది కాలంగా చెబుతున్నది. అది నిజం అనిపించే విషయం సాధికారికంగా వెలుగులోకి వచ్చింది. సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలుమ్ దేవ్బంద్ పట్టణంలో 70% ముస్లిం జనాభా ఉంది.
ఈ నియోజకవర్గంలో 40% ముస్లిం ఓటర్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ సింగ్ తన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ కార్తికేయ రాణాపై రెండో సారి కూడా 7,104 ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకు బిజెపి వారే మజ్లీస్ ను రంగంలో దించుతున్నారని, మజ్లీస్ పార్టీ బీజేపీకి బి టీమ్ అని రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మజ్లీస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో తన అభ్యర్ధిని నిలబెట్టలేదు. అయినా బిజెపి అభ్యర్ధి గెలిచారు. ఈ సారి మజ్లీస్ పార్టీ తన అభ్యర్ధిని నిలబెట్టింది. అయినా బిజెపి అభ్యర్ధి గెలిచారు. దేవ్బంద్లో ఏఐఎంఐఎం అభ్యర్థి ఉమైర్ మదానీకి కేవలం 3,500 ఓట్లు వచ్చాయి.
బీజేపీ, ఎస్పీ అభ్యర్థుల మధ్య దాదాపు 7,000 ఓట్ల తేడా ఉంది. AIMIM తన అభ్యర్థిని నిలబెట్టకుంటే, ఆ మూడు వేలకు పైగా వచ్చిన ఓట్లు SP అభ్యర్థి గెలుపుకు సహాయపడి ఉండేవి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి చౌదరి రాజేంద్ర సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి రహత్ ఖలీల్ లకు కలిపి ఈ సారి 53,000 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించారు.
2017లో బీజేపీకి చెందిన బ్రిజేష్ సింగ్ 1.02 లక్షల ఓట్లను సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాజిద్ అలీకి 72,844 ఓట్లు రాగా, ఎస్పీకి చెందిన మావియా అలీకి 55,385 ఓట్లు వచ్చాయి. 2017 ఎన్నికలలో AIMIM ఈ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేదు.
ఈ సారి మత ప్రాతిపదికన ఓట్లు వేసి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి రహత్ ఖలీల్కు ఎక్కువ ఓట్లు వచ్చేవి. అయితే ఈ సారి కూడా అలా జరగలేదు. ముస్లింలు అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో సారి కూడా బిజెపి అభ్యర్ధి గెలవడం అనేది బిజెపికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నది. తమ పట్ల ముస్లింలు కోపంగా లేరని తమకే ఓట్లు వేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.