తెలుగు రాష్ట్రాలలో ఎండలు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది.
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు మండలాల్లో తీవ్ర వడ గాలులు వీయగా, 43 మండల్లాల్లో వడగాలులు వీచాయి. తీవ్ర వడగాలులు వీచిన 3 మండలాలు విశాఖపట్నంలోనే ఉండడం గమనార్హం. ఇక రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని 8 మండల్లాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే రానున్న 48 గంటల్లో 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఈ జిల్లాలు ఇవే.. విజయనగరం (2), తూర్పుగోదావరి (01), కృష్ణా (03), గుంటూరు (02) మండలాల్లో తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.