ఆదివాసీ ,దళిత , గిరిజన, బహుజన ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియా లొనే అతిపెద్ద కుంభమేళా మేడారం , కులమతాలకు అతీతంగా ఆరాధించే వనదేవత లైన సమ్మక్క సారలమ్మలు ఏమైనా దేవతలా దేవలోకం నుండి దిగి వచ్చారా, అంతా బోగస్ అని కించపరుస్తూ చిన్న జీయర్ స్వామి ఒక టీవీ చానల్ వేదికగా మాట్లాడడాన్ని సమతా సైనిక్ దళ్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు
. అంతకుముందు కూడా కులాలు ఉండాలి, కులాలు పోకూడదు అంటూనే ఒకపక్క సమానత్వం గురించి బోధించడం విడ్డూరంగా ఉందన్నారు. మేక మాంసం తినే వాళ్ళకు మేక బుద్ధులు వస్తాయి కోడి మాంసం తినే వాళ్లకు కోడి బుద్ధులు వస్తాయని మాట్లాడడం దళిత,గిరిజన బహుజనులను కించపరచడమేనన్నారు. వనదేవతలను కించపరిచిన చిన్న జీయర్ స్వామి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వెంటనే తెలియ చేయాలని కోరారు. చిన్న జీయర్ స్వామి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ప్రజాసంఘాల సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.