ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి లోపల, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొల్లాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్యక్రమంలో నేడు ఆమె పాల్గొన్నారు.
తన నివాసంలోని తొట్టెలు, పూల కుండీలలో చెత్తను, ఎండిన ఆకులను తొలగించి తాజా నీటితో నింపారు. ప్రజలందరూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని, మంత్రి కేటీఆర్ చేపట్టిన కార్యక్రమాన్ని మంచి అవకాశంగా భావించి పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి అన్నారు.