అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక లో నిన్న నూతనంగా నిర్మిస్తున్న భవనంలోని మొదటి అంతస్తులో స్లాబ్ కూలిన ఘటనలో చనిపోయిన భవన నిర్మాణ కూలీ ఎర్రోళ్ల విజయ్ (17) కుటుంబానికి న్యాయం చేయాలని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో గోల్నాక లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృత, బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మ వెంకట్ రెడ్డిలు, అంబర్పేట నియోజకవర్గ సీపీఎం అధ్యక్షుడు మహేందర్ లు పాల్గొన్నారు. నల్లకుంట నివాసి అయిన కార్మికుడు ఎర్రోళ్ల విజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ భవన నిర్మాణ కార్మికులు, భవనం నిర్మాణం చేపట్టిన యజమాని ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎర్రోళ్ల విజయ్, కుటుంబానికి తండ్రి ఎర్రోల నర్సింహ, తల్లి నిర్మాలకు గోల్నాక డివిజన్ కార్పోరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ రూ:50,000/- ఆర్దిక సాయం అందజేశారు. ఈ ధర్నాకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
సత్యం న్యూస్, అంబర్పేట