ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న క్రీస్తు ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ప్రేమ అన్నది మానవ లక్షణం అని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారని ఆయన తెలిపారు. లోకానికి నిస్వార్థ సేవామార్గాన్ని సూచించిన శాంతి ప్రదాత క్రీస్తు.
తనకు కీడు తలపెట్టిన స్వార్థపరులను సైతం క్షమించగలిగాడు కాబట్టే జనం ఆయన్ను దైవకుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి క్రీస్తు మార్గం సర్వజనులకు ఆచరణీయం.
ఆయన చూపిన మార్గంలో పేదల పట్ల కరుణ కలిగి ఉందాం. కరుణామయుడైన ఏసు దీవెనలు మీ ఇంటిల్లిపాదికీ లభించాలని.. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని ప్రశాంతతను పంచాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు అన్నారు.