కరోనా మాస్కులు అడిగి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోపం తెప్పించి సస్పెండ్ అయిన నర్సీపట్నం ఎనస్తటిస్టు డాక్టర్ సుధాకర్ మానసిక ప్రశాంతత కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్ది రోజులుగా మానసిక వైద్య శాలలో చిక్కుకుపోయిన డాక్టర్ సుధాకర్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల అయ్యారు.
ప్రభుత్వ మానసిక వైద్య శాలలో డాక్టర్లు సరైన చికిత్స అందించకపోవడంతో ఆయనకు కాళ్లు వాయడం, పెదవులు చిట్లడం, గొంతులో పుండ్లు పడటం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన తల్లి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడికి ఎలాంటి మానసిక వ్యాధి లేదని పిచ్చి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురావాలని ఆమె కోర్టును కోరడంతో హైకోర్టు ఆయనను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్ఛార్జి అయ్యాక విశాఖపట్నంలోనే ఓ రహస్య ప్రదేశంలో మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్లు, తనకు మద్దతు పలికేందుకు వచ్చేవారినీ ఐదురోజుల దాకా రానివ్వకూడదని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.
సుధాకర్ను ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించిందెవరన్నది చర్చనీయాంశమైంది. ఆయనే స్వయంగా వచ్చారంటూ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ప్రకటన విడుదల చేశారు. సుధాకర్ను పోలీసులు కేజీహెచ్కు తీసుకురాగా ఓపీలో చూశామని, ఆసుపత్రిలో హడావుడి సృష్టించడంతో మానసిక వైద్యశాలకు పంపామని, పోలీసులు వారి వాహనంలో తీసుకెళ్లారని కేజీహెచ్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.
కేజీహెచ్లో చేర్పించాక సుధాకర్ అక్కడి వైద్యుల ఆధీనంలో ఉన్నట్లేనని, వారి సిఫారసుల ప్రకారమే తాము మానసిక వైద్యశాలకు తీసుకెళ్లాం గానీ, సొంత నిర్ణయం తీసుకోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు.