కరోనా మహమ్మారి ఒక తెలుగు జర్నలిస్టును కబళించింది. టీవీ 5 లో పని చేస్తున్న రిపోర్టర్ మనోజ్ యాదవ్ కరోనా కారణంగా నేటి ఉదయం 9.30కి చనిపోయాడు. మాదన్న పేటకు చెందిన టీవీ 5 రిపోర్టర్ మనోజ్ యాదవ్ కు కరోనా పాజిటివ్ రావడంతో అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కోమార్బిడిటీ లక్షణాలు కూడా ఉండటంతో వయసు తక్కువ ఉన్నా కూడా మనోజ్ కు కరోనా మరణం వరకూ తీసుకెళ్లింది. మనోజ్ కు కోమార్బిడిటీ లక్షణాలు గా మయస్తేనియా గ్రేవీస్, బైలేటరల్ న్యుమోనియా ఉన్నట్లు డాక్టర్లు కనుగొన్నారు. ఈ కారణంగా మనోజ్ కరోనా సోకిన వెంటనే మరణించాడు.
మనోజ్ సామాజిక సేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ తనకు చేతనైనంత సాయం చేసేవాడు. జర్నలిజం ఒక పవిత్ర వృత్తిగా భావించి మనోజ్ కొనసాగుతున్నాడు. చిన్న వయసులోనే మనోజ్ మరణించడం తెలుగు జర్నలిజానికి తీరని లోటు. ఆరు నెలల కిందటే అతను వివాహం చేసుకున్నాడు. మనోజ్ ఆత్మకు శాంతి కలగాలని సత్యం న్యూస్ ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.