డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన లబ్దిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
అల్లిపురంలో 8 బ్లాకుల్లో 192 గృహాలను జి ప్లస్ 2 పద్దతిలో నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 168 గృహాల పనులు ప్రారంభించగా, ప్లాస్టటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. బ్లాకుల వారిగా పనులు పూర్తిచేసి, పూర్తి అయిన బ్లాకులను వెంట వెంటనే అందజేయాలన్నారు. వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జి ప్లస్ 2 పద్దతిలో 96 గృహాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. ఇట్టి గృహాల్లో ప్లాస్టరింగ్, మిగులు పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు.
పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు త్వరగా పూర్తయితే బిల్లులు వెంటనే వస్తాయని ఆయన తెలిపారు. వర్కర్లను పెంచాలని, అన్ని బ్లాకుల్లో పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో రోజువారి పురోగతి ఉండాలని, అధికారులు రోజూ పనులు జరిగేట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. సమస్యలు ఉంటే దృష్టికి తేవాలని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం కావున అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు.