కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని లంకలగన్నవరం గ్రామంలో మట్టి మాఫియాతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన విషయం వివరాల్లోకి వెళితే గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం పుచ్చల్లంక గ్రామం నుండి ప్రతి రోజూ వందలాది ట్రాక్టర్లతో రాత్రి సమయాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి తోడు లంకల గన్నవరం గ్రామం లోని పొలిమేర నడిగాడి నుంచి వేమన వారి పాలెం మీదుగా పలు గ్రామాలకు ఈ మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారు.
రెవిన్యూ అధికారులు సంగతి ఎలా ఉన్న పోలీస్ అధికారులు పూర్తిగా కోనసీమ జిల్లాకు సంబంధించిన గొడవల నేపథ్యంలో నిర్వహిస్తున్న పహారాలో బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మట్టి మాఫియా దారులు మట్టిని విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. ఈ మట్టి ట్రాక్టర్లు రహదారులపై రాత్రి సమయాల్లో అధిక శబ్దంతో, అతి వేగంగా వెళ్ళడం వలన ప్రజల కంటిపై కునుకు లేకుండా పోయింది.
లంకల గన్నవరం గ్రామంలో ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్న ట్రాక్టర్ ల వలన రోజువారి కూలి పనులు చేసుకునే వారు, రైతులు, ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా పాల్పడుతున్న కాసుల కొరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజల వద్ద నుండి ఈ అక్రమ మట్టి రవాణాకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి మాఫియా చేర నుండి లంకల గన్నవరం గ్రామ ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.